ప్రమాదపుటంచులో సెల్ఫీ ఫోటోలకు ఆసెక్తి చూపుతున్న ప్రకృతి ప్రేమికులు
బ్రిడ్జిపై నుండి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తులు
మొర్రేడు బ్రిడ్జిపై వాహనాల నిలుపుదల వలన ట్రాఫిక్ కి అంతరాయం
కొత్తగూడెం , సెప్టెంబర్ 01 ( ఉదయం న్యూస్ )
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొర్రేడు వాగు ఉగ్రరూపంతో పొంగిపొర్లుతున్న పరిస్థితులు లక్ష్మిదేవి పల్లి మండలంలో కనిపిస్తుంది. భారీ వరదతో వాగు పొంగడంతో ప్రకృతి ప్రేమికులు ఆసక్తిగా చూపేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సముద్ర అలలు తలపించేలా వరద పోటెత్తడంతో ప్రజలు సెల్ఫీ ఫోటోలు తీసుకునేందుకు మొర్రేడు వాగు బ్రిడ్జి పై బారులు తీరారు.
బ్రిడ్జిపై నుండి వినాయకుడిని నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టిన భక్తులు
వినాయక చవితి సందర్భంగా నిత్యం పూజలు అందుకున్న బొజ్జగణపయ్య ను నిమజ్జనం చేసేందుకు భక్తులు మొర్రేడు బ్రిడ్జి ప్రాంతాన్ని ఉపయోగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా మొర్రేడు వాగు పొంగి పొర్లడంతో బ్రిడ్జి పై నుండే వినాయక నిమజ్జన కార్యక్రమాల్ని చేపడుతున్నారు. నిత్యం వాహనాల తో రద్దీగా ఉండే రహదారి కావడంతో మొర్రేడు బ్రిడ్జిపై ప్రమాదం అని తెలిసినప్పటికీ భక్తులు భక్తి మైకంలో తేలి ఆడుతున్నారు స్థానిక గ్రామపంచాయతీల హెచ్చరిక బోర్డు లేకపోవడం మరియు మండల పోలీస్ అధికారుల హెచ్చరికల ఆదేశాలు లేకపోవడంతో భక్తులు తమ ఇష్టానుసారంగా ప్రమాదకర ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు మొర్రేడు బ్రిడ్జి పై నిమజ్జన ప్రాంగణంగా మార్చుకుంటే ట్రాఫిక్ కి అంతరాయం కలగడమే కాకుండా ఏదైనా ప్రమాదం చోటుచేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు.

