జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని ప్లకార్డ్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం
ఇమంది ఉదయ్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన జర్నలిస్ట్ మిత్రులు
కొత్తగూడెం , సెప్టెంబర్ 04 ( ఉదయం న్యూస్ )
జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్లకార్డు తో నిరసన వ్యక్తం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది ఉదయ్ కుమార్ ను జర్నలిస్టు మిత్రులు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో జర్నలిస్టుల సమస్యను శాంతియుతంగా తెలిపేందుకు ఉదయ్ కుమార్ ఫ్లకార్డుతో నిరసన తెలిపారు. సాహసోపేతమైన కార్యక్రమంతో జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రి సభలో నిరసన తెలిపిన ఉదయ్ కుమార్ ను గురువారం కొత్తగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో జరిగిన అభినందనల సభ కార్యక్రమంలో కొత్తగూడెం జర్నలిస్ట్ మిత్రులు ఆయనను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కానీ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నా కానీ జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం కావడం లేదని సాహసోపేత పోరాటానికి తెరదీసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది ఉదయ్ కుమార్ అని కొనియాడారు. యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల సుధాకర్ , జాన్సన్ బాబు , కొండ జంపన్న , దశరద్ రజువా , కోలా కుమార్ , మొగిలిపాక మురళీకృష్ణ , చదలవాడ సూరి , వజ్జ చంద్రశేఖర్ , నరేష్ , శిరసాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

