- మూడు సార్లు యాజమాన్యంతో యూనియన్ నేత చర్చలు
- ఇవ్వాళ ఉద్యోగులకు జీతాలు పంపిణి
స్వతంత్ర టీవీలో యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తొలగించి, ఉద్యోగులకు బకాయి ఉన్న జీతాలను ఇప్పించి, వారికి న్యాయం చేసింది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే).
వివరాల్లోకి వెళ్తే…. స్వతంత్ర టీవిలో పనిచేస్తున్న 42మంది ఉద్యోగులకు రెండు మూడు నెలల నుండి జీతాలు అందలేదు. దీంతో వారం రోజుల క్రితం బాధిత ఉద్యోగులు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీని సంప్రదించి తమ గోడు వినిపించారు. దీనిపై ఆయన స్పందించి బంజారా హిల్స్ లోని స్వతంత్ర టీవీ కార్యాలయానికి వెళ్లి, సంస్థ యజమాని కృష్ణ ప్రసాద్ తో చర్చించారు. మొదటి రోజు చర్చలు సఫళీకృతం కాలేదు. దీంతో మళ్ళీ ఇవ్వాళ ఆయన చైర్మన్ తో సమావేశమై ఎట్టకేలకు సమస్యను పరిష్కరించారు. ఉద్యోగులందరికి బకాయి ఉన్న జీతాలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడమే కాకుండా ఇవ్వాళ మొదటి దఫా చెక్కులను విరాహత్ అలీ సమక్షంలో అందించడం అభినందనీయం. రెండు మూడు నెలలుగా ఆర్థిక కష్టాల్లో ఉన్న తమకు అండగా నిలిచి, జీతాలు ఇప్పించిన టీయూడబ్ల్యూజే సంఘానికి బాధిత ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

